కాపిటల్ 5 వ భాగం
పరమ అదనపు విలువ ఉత్పత్తీ, సాపేక్ష అదనపు విలువ ఉత్పత్తీ
అధ్యాయం -16
పరమ అదనపు విలువా-సాపేక్ష అదనపు విలువా
***********
ఉత్పాదక శ్రమా - పెట్టుబడికి శ్రమ లొంగుబాటూ
కాపిటల్ మొదటి సంపుటంలో మొదటి భాగం: సరుకులూ - డబ్బూ.
రెండోది: డబ్బు పెట్టుబడిగా మారడం. మూడోది: పరమ అదనపు విలువ ఉత్పత్తి. నాలుగోది:
సాపేక్ష అదనపు విలువ ఉత్పత్తి. రెండు రకాల అదనపు విలువ ల ఉత్పత్తినీ చర్చించాక ఇప్పుడు ఈ 5 వ భాగంలో రెంటి ఐక్యతనీ చర్చిస్తాడు.
మూడోభాగంలో( 7 వ చాప్టర్లో) ఉత్పాదక శ్రమ గురించి క్లుప్తంగా ఉంటుంది. ఇక్కడ (16 వ చాప్టలో) వివరంగా
ఉంటుంది.
ఉత్పాదక శ్రమ
ఉత్పాదక శ్రమ అనే కాటగరీ 7 వ చాప్టర్లో వస్తుంది. అక్కడ శ్రమప్రక్రియని అనిర్దిష్టంగా, దాని చారిత్రక రూపాలను పక్కనబెట్టి, ప్రకృతికీ మనిషికీ మధ్య జరిగే చర్యగా పరిశీలన మొదలయింది. మొత్తం శ్రమ ప్రక్రియని దాని ఫలితం
వైపునుండి చూసినట్లయితే,శ్రమ సాధనాలూ, శ్రమ పదార్ధమూ రెండూ ఉత్పత్తి సాధనాలు అవుతాయి.ఆ శ్రమ
ఉత్పాదక శ్రమ అవుతుంది.: కేవలం శ్రమ ప్రక్రియ వైపు నుంఛే ఉత్పాదక శ్రమని తేల్చడం పెట్టుబడిదారీ ఉత్పత్తి
విధానానికి నేరుగా వర్తించదు.
ఎందువల్ల?
పెట్టుబడిదారీ ఉత్పత్తి కేవలం సరుకుల ఉత్పత్తి మాత్రమే కాదు,సారభూతంగా అది అదనపువిలువ ఉత్పత్తి.
శ్రామికుడు ఉత్పత్తి చేసేది తనకోసం కాదు, పెట్టుబడి కోసం. కాబట్టి అతను ఉత్పత్తి చెస్తేనే సరిపోదు.అదనపు విలువ ఉత్పత్తిచేసి తీరాలి.పెట్టుబడి దారుడికోసం అదనపు విలువని ఉత్పత్తి చేసి ఆవిధంగా పెట్టుబడి స్వయం విస్తరణ కోసం పనిచేసే శ్రామికుడు మాత్రమే ఉత్పాదక శ్రామికుడు.పెట్టుబడిదారీ విధానంలో ఇదే ఉత్పాదక శ్రామికుడికి నిర్వచనం.
ఉదాహరణకి, ఒక టీచర్ తన విద్యార్ధులకు చదువు చెప్పడంతో పాటు స్కూలు యజమానిని సంపన్నుణ్ణి చేసేందుకు గుర్రంలాగా పనిచేస్తాడు. ఆ యజమాని తన పెట్టుబడిని సాస్ ఫాక్టరీలో కాకుండా చదువుల ఫాక్టరీలో పెట్టాడనేది, ఈ సంబంధాన్ని ఏమాత్రం మార్చదు.
ఇక్కడ సంబంధం కేవలం పనికీ,దాని ఫలితానికీ మాత్రమే కాదు.అంటే, శ్రామికునికీ, ఉత్పాదితానికీ మాత్రమే కాదు.అది చారిత్రకంగా వికసించిన ఏర్పడి, శ్రామికుణ్ణి అదనపువిలువ సృజించే ప్రత్యక్ష సాధనంగా ముద్రవేసే సంబంధం.
అందువల్ల ఊత్పాదక శ్రామికుడుగా ఉండడం అదృష్టం కాదు, దురదృష్టం.
ఒక శ్రామికుడు ఉత్పాదక శ్రామికుడు ఔనా కాదా అనేది ఉత్పత్తి ప్రక్రియ బయట నిర్ణయమవుతుంది.ఉత్పాదక శ్రామికుడు అనే భావన శ్రమకీ దాని ప్రయోజనకర ప్రభావానికీ
ఉన్న సంబంధాన్ని, శ్రామికుడికీ, శ్రమ ఉత్పాదితానికీ మధ్య సంబంధాన్నిమాత్రమే
కాకుండా, ఒక విశిష్టమైన సామాజిక
ఉత్పత్తి సంబంధాన్ని కూడా ఇముడ్చుకొని ఉంటుంది;
ఆ
సంబంధం చారిత్రకంగా ఏర్పడి, శ్రామికుణ్ణి అదనపువిలువ సృజించే ప్రత్యక్ష సాధనంగా ముద్రవేసే సంబంధం.
ఈ సంబంధం ముందుకు పోయే కొద్దీ , అది శ్రామికులమీద ప్రతికూల ప్రభావం చూపుతుంది.
అందువల్ల ఉత్పాదక శ్రామికుడుగా ఉండడం అదృష్టం కాదు, దురదృష్టం- అంటాడు.
ఈ ఫ్రేజ్ ని వివరించే ముందు తన నిర్వచనాన్ని అంగీకరించే వెనకటి సాంప్రదాయ రాజకీయ అర్ధ
శాస్త్రజ్ఞుల్ని కోట్ చేస్తాడు. వాళ్ళు అదనపు విలువ ఉత్పత్తి చెయ్యడాన్ని ఉత్పాదక శ్రామికుని విశిష్ట లక్షణం అని చెప్పారు.
అదనపువిలువ స్వభావానికి సంబంధించి వాళ్ళ అవగాహనని బట్టి ఉత్పాదక శ్రామికుడికి నిర్వచనం మారుతూ
వచ్చింది. ఆవిధంగా ఫిజియోక్రాట్లు వ్యవసాయ శ్రమ మాత్రమే ఉత్పాదక శ్రమ అన్నారు.కారణం, అదొక్కటే
అదనపువిలువని సృష్టిస్తుంది అనేవారు.అలా ఎందుక అనేవాళ్ళంటే, వారికి అదనపువిలువ అద్దె రూపంలో
తప్ప మనుగడలో లేదు.
ఉత్పాదక శ్రమ గురించి కాపిటల్ నాలుగో సంపుటంలో మరింత స్పష్టంగా, వివరంగా ఉంటుంది. Theories
of Surplus Value సంపుటంలో Theories of Productive and Unproductive Labour పేరుతో 150 పేజీల చాప్టర్ వుంది.
అదనపు విలువని ఉత్పత్తిచేసే మార్గాలు
పెట్టుబడిదారీ విధానంలో ఉత్పాదక శ్రమ అంటే, అదనపు విలువని ఉత్పత్తిచేసే శ్రమే. అదనపు విలువని ఉత్పత్తిచేసే మార్గాలు రెండు.
1.పనిదినం పొడిగింపు
శ్రామికుడు తన వేతనం విలువని పునరుత్పత్తి చేసాక,ఆ తర్వాత ఉత్పత్తిచేసే విలువే అదనపువిలువ. ఇలా పనిదినం పొడిగింపు ద్వారా ఏర్పడే అదనపు విలువే పరమ అదనపు విలువ.ఇది పెట్టుబడిదారీ వ్యవస్థకు సాధారణ
పునాది.సాపేక్ష అదనపువిలువ ఉత్పత్తికి ఆరంభ బిందువు కూడా.
సాపేక్ష అదనపువిలువ అదివరకే పనిదినం రెండుభాగాలుగా - అవసర శ్రమ భాగం, అదనపు శ్రమభాగంగా - ఉన్నట్లు భావిస్తుంది.
2.అవసర శ్రమ కాలం తగ్గింపు
అదనపు శ్రమని పొడిగించడానికి అవసర శ్రమ కుదించబడుతుంది. వేతనానికి సమానమైనది తక్కువ కాలంలో
ఉత్పత్తయ్యే పద్ధతులు అవలంబించడం ద్వారా. పరమ అదనపు విలువ ఉత్పత్తి పనిదినం నిడివిని బట్టి ఉంటుంది. సాపేక్ష అదనపు విలువ ఉత్పత్తి శ్రమ సాంకేతిక ప్రక్రియల్నీ, సమాజ నిర్మాణాన్నీ విప్లవీకరిస్తుంది
సాపేక్ష అదనపు విలువా - కొత్త ఉత్పత్తివిధానమూ
సాపేక్ష అదనపు విలువ ఉత్పత్తి పూర్తిగా కొత్త ఉత్పత్తివిధానాన్ని ఏర్పరుస్తుంది.దాన్ని మార్క్స్ ప్రత్యేకమైన
పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం అన్నాడు. లేదా పెట్టుబడికి శ్రమ నిజమైన లొంగుబాటు. ఇందుకు భిన్నంగా సాపేక్ష
అదనపు విలువ ఉత్పత్తికి ముందున్న పెట్టుబడిదారీ విధానాన్ని లాంఛనప్రాయమైన లొంగుబాటు అన్నాడు.
అంటే, పెట్టుబడికి శ్రమ లొంగుబాటు రెండు విధాలు:
1.లాంఛనప్రాయమైన లొంగుబాటు 2. నిజమైన లొంగుబాటు
లాంఛనప్రాయమైన లొంగుబాటు
మొదట పెట్టుబడి అప్పటికున్న శ్రమ ప్రక్రియని - అంటే, టెక్నిక్స్ నీ,మార్కెట్లనీ ఉత్పత్తిసాధనాల్నీ, శ్రామికుల్నీ- తన వశం లోకి లాక్కుంటుంది. మొత్తం శ్రమ ప్రక్రియ అంతకు ముందు లాగే కొనసాగుంది; అయితే ఉత్పత్తి సాధనాలమీద పూర్తి ఆధిపత్యం (monopoly) వల్ల, ఆకారణంగా శ్రామికుల జీవనాధార సాధనాల మీద పూర్తి ఆధిపత్యం ఉండడం చేత, పెట్టుబడి దారుడు కార్మికుణ్ణి వేతన శ్రమకి లొంగేట్లు బలవంత పెడతాడు. ఉన్న మార్కెట్లనే వాడుకుంటూ
పెట్టుబడిని సంచయనం చెయ్యగలుగుతాడు.
లాంఛనప్రాయమైన లొంగుబాటు ని మార్క్స్ ఇలా నిర్వచించాడు: పెట్టుబడి సంబంధం బయట, దానికి ముందు వేతనం ద్వారా పెట్టుబడిదారులు
శ్రమ ప్రక్రియల్ని పట్టులోకి తెచ్చుకున్నప్పుడు లాంఛన ప్రాయమైన లొంగుబాటు సంభవిస్తుంది. నిజమైన లొంగుబాటు లో పెట్టుబడికి అనుకూలంగా శ్రమ
ప్రక్రియ మార్చబడుతుంది. ఉదాహరణ: వేతనానికి చేత్తో నెయ్యడం (లాంఛనప్రాయమైన
లొంగుబాటు) అవుతుంది. ఆ తర్వాత యంత్రం
ద్వారా నెయ్యడం (నిజమైన లొంగుబాటు)
పరమ అదనపు విలువ మీద ఆధారపడ్డ రూపాన్ని నేను పెట్టుబడికి శ్రమ లాంఛనప్రాయంగా లోబడడం అంటాను. ఎందుకంటే వెనకటి ఉత్పత్తి విధానాలకంటే ఇది లాంఛనప్రాయంగా మాత్రమే భిన్నమైంది; ఆ వెనకటి విధానాల
పునాదుల మీద ప్రయత్నం లేకుండానే పైకి లేస్తుంది/- ఉత్పత్తిదారుడు స్వయంనియామకుడు అయినప్పుడో, లేక తక్షణ ఉత్పత్తిదారులు ఇతరులకు అదనపు శ్రమ ఇవ్వడం కొసం బలవంత పెట్టినప్పుడో. మారేదంతా - బలవంతం వర్తింపచెయ్యడమే.
అదనపు
శ్రమని స్వాయత్తం చేసుకునేవాడికీ, దాన్ని ఇచ్చేవాడికీ మధ్య
డబ్బు సంబంధం. ఒక సరుకు ఓనర్ కీ మరొక సరుకు ఓనర్ కీ సంబంధం. ఈ డబ్బు సంబంధంలో
లొంగుబాటు లేదు.అమ్మిన వాణ్ణి ఆధాపడేట్లు చేసేది: కొన్నవాడు శ్రమ పరిస్థితుల
సొంతదారుడు కావడమే.
నిజమైన లొంగుబాటు
శ్రమ యొక్క వస్తుగత పరిస్థితులూ (ఉత్పత్తి సాధనాలు), శ్రమ యొక్క వ్యక్తిగత పరిస్థితులూ శ్రామికుణ్ణి పెట్టుబడిగా ఎదుర్కుంటాయి- తన శ్రమ శక్తిని కొనే వాని మోనోపొలీగా. ఈ శ్రమ పరిస్థితులు అతనికి పరాయి ఆస్థిగా
మరింత పూర్తిగా ఎదురయ్యే కొద్దీ, పెట్టుబడికీ వేతన శ్రమకీ లాంఛన ప్రాయమైన సంబంధం మరింత ప్రభావ
వంతం అవుతుంది. అంటే, లాంఛన ప్రాయమైన లొంగుబాటు ఎక్కువ సమర్ధవంతంగా సాధించబడితే,
ఇది నిజమైన లొంగుబాటుకి ముందస్తు షరతు అవుతుంది.
ఇప్పటికింకా ఉత్పత్తి విధానంలో మార్పు మాత్రం లేదు.సాంకేతికత పరంగా చూస్తే, శ్రమ ప్రక్రియ వెనకటిలాగే సాగుతుంది - ఇప్పుడు శ్రమ పెట్టుబడి అధీనంలో ఉంది. ఉత్పత్తి ప్రక్రియలో రెండు ఘట్టాలు ఏర్పడతాయి:
ఆధిపత్యం, లొంగివుండడం అనే ఆర్ధిక సంబంధం. కారణం శ్రమ శక్తి వినియోగాన్ని పెట్టుబడిదారుడు పర్య వేక్షించడం, నిర్దేశించడం.
లాంఛనప్రాయమైన లొంగుబాటు కార్ఖానా ఉత్పత్తి కాలానికి లాక్షణికమైనది. నిజమైన లొంగుబాటు ఫాక్టరీకి లాక్షణికమైనది.
లొంగుబాటు లేని పరిస్థితులు
ఈరెంటి పక్కనే అసలు పెట్టుబడికి శ్రమ లొంగుబాటు లేని పరిస్థితులు ఉంటాయి. అదనపు విలువ బలవంతంగా,
ప్రత్యక్షంగా లాగబడని రూపాల్ని చెబితే చాలు. పెట్టుబడికి ఉత్పత్తిదారుడు లాంఛన ప్రాయంగా లొంగని రూపాల్ని
చెబితే చాలు.ఆ రూపాల్లో పెట్టుబడి ఇంకా శ్రమప్రక్రియని తన ఆధిపత్యంలోకి తెచ్చుకోలేదు. చేతి వృత్తుల్నీ, వ్యవసాయాన్నీ పాతపద్ధతిలో కొనసాగించే స్వతంత్ర ఉత్పత్తిదారుల పక్కనే వీళ్ళ కష్టార్జితం మీద బతికే
పరాన్నభుక్కులైన వడ్డీ వ్యాపారో, వర్తకుడో తన పెట్టుబడితో ఉంటాడు.సమాజంలో ఈతరహా దోపిడీ ప్రబలంగా
ఉంటే, అది పెట్టుబడి దారీ ఉత్పత్తివిధానాన్ని మినహాయిస్తుంది. అంటే అది పెట్టుబడి దారీ ఉత్పత్తివిధానం కాదు.
అయితే ఆ రూపం ఆ విధానానికి ఒక పరిణామ దశగా ఉపకరించవచ్చు - మధ్య యుగాల చివరలో ఉన్నట్లు. ఆఖరి విషయం:ఆధునిక గృహపరిశ్రమలు చూపుతున్నట్లు, ఆధునిక పరిశ్రమల నేపధ్యంలో అక్కడక్కడా కొన్ని మధ్యంతర రూపాలు తిరిగి ఏర్పడవచ్చువాటి రూపురేఖలు పూర్తిగా మారిపోయినప్పటికీ.
అదనపువిలువ ఉత్పత్తిలొ నిరంతర పెరుగుదల సరుకులని నిరంతరం చౌకపరుస్తుంది. ఆవిధంగా పెట్టుబడి
ఉన్న డిమాండ్ ని, సమాజ అవసరాల్ని అనుసరించడం కాకుండా, ఆవసరాల్నే, డిమాండ్ నే విప్లవీకరిస్తుంది.
కొత్త అవసరాల్ని ప్రేరేపించడం ద్వారా, మార్కెట్లని విస్తరించడం ద్వారా,కొత్త ఉత్పత్తుల్ని తయారుచెయ్యడం
ద్వారా. లాభం కోసం ఉత్పత్తి దర్శనమిస్తుంది. ఇది నిరంతర సాంకేతికాభివృద్ధికి దోహదం చేస్తుంది.ఉత్పత్తి
ప్రక్రియలో ఉపయోగించే శాస్త్ర ఆవిష్కరణల కోసం వెదుకుతుంది. వెంపర్లాడుతుంది. ఈ ఆవిష్కరణలు కూడా
పెట్టుబడికింద లొంగివుండే వ్యాపారం అవుతుంది. కాబట్టిశ్రమ ఉత్పాదకత పెరుగుదలకి ఒక కొత్త ఒనరు
కనబడుతుంది. ఈ ఒనరు ఆధునిక ఫాక్టరీకి పూర్వం తెలియదు.
సాపేక్ష అదనపు విలువ ఉత్పత్తి
ఒకపక్క,పరమ అదనపు విలువ ఉత్పత్తికి లాంఛనప్రాయమైన లొంగుబాటు సరిపొతుంది.అంటే ఉదాహరణకి,
మునుపు తమకోసం పనిచేసిన చేతివృత్తిచేసేవాళ్ళు గానీ, ఒక యజమాని దగ్గర అప్రెంటిస్ లుగా పనిచెసిన వాళ్ళు గానీ పెట్టుబడిదారుడి నియంత్రణకింద వేతనశ్రామికులు అవాలి. అందువల్ల మరొకపక్క, సాపేక్ష అదనపు
విలువని ఉత్పత్తిచేసే పద్ధతులు అదేసమయంలో ఎలా పరమ అదనపు విలువని ఉత్పత్తిచేసే పద్ధతులో గమనించాం. ఆంతకుమించి, పనిదినాన్ని ఎక్కువ పొడిగించడం ఆధునిక పరిశ్రమ ప్రత్యేక ఫలితం అని తేలిపోయింది.
ఈ విధానం ఒక ఉత్పత్తిశాఖ నంతటినీ పట్టుకుంటే, అప్పుడు ఆప్రత్యేక పెట్టుబడిదారీ విధానం సాపేక్ష అదనపు
విలువని ఉత్పత్తిచేసే సాధనంగా ఉండదు;అన్ని ముఖ్యమైన శాఖలనీ జయిస్తే అది సాపేక్ష అదనపు విలువని
ఉత్పత్తిచేసే సాధనంగా ఇక ఉండనే వుండదు. అదప్పుడు మామూలు, సామాజికంగా ప్రబలమైన ఉత్పత్తి విధానం
అవుతుంది. అప్పటికి పెట్టుబడిపట్టులోకి రానివి కొత్తగా పత్తులోకి వస్తేనో, పట్టులోనే వున్న పరిశ్రమల్లో ఉత్పత్తి
పద్ధతుల్లో మార్పులు వస్తేనో మరలా సాపేక్ష అదనపు విలువ ఉత్పత్తికి అవకాశం కలుగుతుంది.
పరమ-సాపేక్ష అదనపు విలువల ఐక్యత
ఒక రకంగా చూస్తే, రెంటికీ తీడా లెదేమో అనిపిస్తుంది. సాపేక్ష అదనపు విలువ పరమమయినదే, ఎందుకంటే అది పనిదినాన్ని అవసర శ్రమకాలాన్ని దాటి బలవంతంగా పొడిగిస్తుంది. పరమ అదనపు విలువ సాపేక్షమైనదే, ఎందుకంటే అవసర శ్రమ కాలాన్ని పనిదినంలో ఒక భాగానికి పరిమితమై ఉండడానికి తగినట్లు శ్రమ ఉత్పాదకత పెంపుని
తప్పనిసరి చేస్తుంది.
అదనపు విలువ మారంగానే తేడా తెలుస్తుంది
అదనపువిలువ స్వభావాన్ని గుర్తుంచుకుంటే, ఈ ఐక్యత అంతర్ధానమవుతుంది. పెట్టుబడిదారీ
విధానం సర్వ సాధారణమై నప్పుడు, అదనపు విలువ రేటుని పెంచే
సమస్య ఏర్పడినప్పుడల్లా పరమ-సాపేక్ష అదనపు విలువల మధ్య తేడా తెలుస్తుంది.
శ్రమ శక్తికి దాని విలువ చెల్లించినట్లు భావిద్దాం. అలా అనుకుంటే,మనకొక ప్రత్యామ్నాయం వస్తుంది: శ్రమ ఉత్పాదకతా, శ్రమ తీవ్రతా నిర్ణయమై ఉంటే, పనిదినాన్ని పెంచడం ద్వారా మాత్రమే అదనపువిలువని పెంచగలం. మరొకపక్క, పనిదినం నిడివి నిర్ణీతమైనప్పుడు, పనిదినంలో భాగాలైన అవసర, అదనపు శ్రమకాలాల సాపేక్ష పరిమాణాల్లో
మార్పుల ద్వారా మాత్రమే అదనపు
విలువ రేటుని పెంచ గలుగుతాం. వేతనాలు శ్రమ శక్తి విలువకన్నా తగ్గకుండాఉండి, అదనపు విలువ పెరగాలంటే
1.ఉత్పాదకతన్నా పెరగాలి లేదా శ్రమ తీవ్రతన్నా పెరగాలి. లేదా
2.శ్రమ తీవ్రతన్నా పెరగాలి.
12 వ చాప్టర్లో క్లుప్తంగా మార్క్స్ వాదన ఇదే.
ఉత్పాదకతకీ దోపిడీకీ సంబంధం
శ్రామికుడు రోజంతా తనకోసమే పనిచేసుకున్నంతకాలమూ ఇతరుల కోసం చెయ్యడానికి టైం ఉండదు. శ్రమ ఉత్పాదకత ఒక స్థాయికి చేరాకనే అతనికి కాళీ టైం ఉంటుంది.కాళీ టైం లేకుంటే, అదనపు శ్రమ ఉండదు.అందు వల్ల, పెట్టుబడిదారులూ, బానిస యజమానులూ,భూస్వాములూ ఉండరు. ఒక్క ముక్కలో పెద్ద ఆస్థిపరవర్గం
ఉండదు. రావిన్ స్టొన్ అన్నట్లు: ప్రతిమనిషి శ్రమా తన ఆహార ఉత్పత్తికే సరిపోయే పనయితే అసలు ఆస్థే ఉండేది కాదు.
కాబట్టి అదనపు విలువకి ఒక సహజ ప్రాతిపదిక ఉంది.తనకు అవసరమైన శ్రమ భారాన్ని మరొకని మీద వెయ్యకుండా నిరోధించేది ఏదీ లేదు మనిషిమరొక మనిషిని తినకుండా సహజంగా అడ్డుకో గలిగింది
లేనట్లుగానే.
జంతు స్థాయినుంచి ఎదిగి, శ్రమ కొంతమేర సామాజికమయ్యాకనే ఒకరి అదనపు శ్రమ వేరొకరి ఉనికికి షరతు
అయింది.
ఉత్పాదకతా, దోపిడీ తోడుగా పరిణామం చెందాయి
నాగరికత తొలినాళ్ళలో శ్రమ సాధించిన ఉత్పాదకత అతిస్వల్పం. దాంతోపాటే నాటి కోరికలూ తక్కువే.వాటిని
తీర్చే సాధనాల అభివృద్ధితోపాటూ, ఆసాధనాల ద్వారా అవీ పెరుగుతాయి. అంతేగాక, అప్పట్లో ఇతరుల శ్రమ
మీద బతికే వాళ్ళు, ప్రత్యక్ష ఉత్పత్తిదారులతో పోలిస్తే సమాజంలో అత్యంత అల్పాల్ప భాగం మాత్రమే. ఉత్పాదకత
పెరిగేకొద్దీ, ఆ కొద్దిభాగం సాపేక్షంగానూ పెరుగుతుంది, పరమంగానూ పెరుగుతుంది.
పెట్టుబడి - దానితో వచ్చే సంబంధాలతో సహా - దీర్ఘకాల అభివృద్ధి ప్రక్రియ ఫలితం అయిన ఆర్ధిక క్షేత్రం
నుంచి ఉత్పన్నం అవుతుంది.
పెట్టుబడికి పునాదిగానూ, ఆరంభ బిందువు గానూ ఉపకరించే శ్రమ ఉత్పాదకత ప్రకృతి బహుకృతి కాదు,
వేల శతాబ్దాల చరిత్ర బహుమతి.
శ్రమ ఉత్పాదకత ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా, భౌతిక పరిస్థితులు ఆ ఉత్పాదకతని కట్టివేస్తాయి. సంకెళ్ళ
వుతాయి.అవి మనిషి శరీరానికీ, చుట్టూ ఉన్న ప్రకృతికీ చెందినవి.
బాహ్య భౌతిక పరిస్థితులు రెండు పెద్ద ఆర్ధిక తరతులుగా ఉంటాయి: జీవనాధార సాధనాల చెందిన ప్రకృతి
సంపద- సారవంతమైన నేల,చేపలతో నిండివున్న నీళ్ళూ మొదలైనవి.
శ్రమ సాధనాలకు చెందిన ప్రకృతి సంపద - జలపాతాలూ, నౌకా యానానికి తగిన నదులూ,కొయ్యలూ,
లోహాలూ,బొగ్గూ వగయిరా.
నాగరికత తొలికాలంలో అభివృద్ధికి ఊపు కలిగించేది మొదటి తరగతికివి. అభివృద్ధి పై స్థాయిలో ఉన్నప్పుడు
ఊపు కలిగించేది రెండో తరగతివి.
ఇండియాలోనూ, నల్ల సముద్ర తీర ప్రాంతాల్లోనూ జీవనాధార సాధనాలు ఎక్కువ. ప్రాచీనకాలపు ఎథెన్స్
లోనూ, కోరింథ్ లోనూ సహజ శ్రమ సాధనాలు ఎక్కువ.
తప్పక తీర్చాల్సిన అవసరాలు తక్కువగా ఉండి,భూసారం ఎక్కువగానూ, వాతావరణం అనుకూలంగానూ
ఉంటే, శ్రామికుని పోషణకి పట్టే శ్రమ కాలం తక్కువగా ఉంటుంది. తనకోసం చెయ్యాల్సిన శ్రమ పైన ఇతరులకు చెయ్యగలిగిన శ్రమ చాలా ఎక్కువ వుంటుంది.డిడొరస్ ఏనాడో ఈజిప్షియన్ల గురించి ఇలా చెప్పాడు:
పిల్లలపెంపకానికి వాళ్ళకి అయ్యే ఖర్చూ, శ్రమా నమ్మశక్యం కానంత తక్కువ. చేతికొచ్చిన పదార్ధాన్ని వండి
పెడతారు.తేగలూ,చిత్తడి నేలల్లో దొరికే దుంపలూ,వంటి వాటిని అలాగే పెడతారు, కొన్నిటిని ఉడికించీ, కొన్నిటిని
కాల్చీ పెడతారు.ఎక్కువమంది పిల్లలు చెప్పులూ, బట్టలూ లేకుండానే తిరుగుతారు. కారణం వాతావరణం హాయిగా ఉండడమే. అందువల్ల ఒక్కొ పిల్లాడికి పెద్దయ్యే దాకా అయ్యే ఖర్చు 20 డ్రాక్మాలకు మించదు. శ్రామికుల అవసర
శ్రమకాలం ఎంత తక్కువగా ఉంటే, అంత ఎక్కువ అదనపు శ్రమ చెయ్యగలుగుతారు. ఫలితంగా, జనాభా శ్రమలో
ఎక్కువభాగంఇతరత్రా ఉపయోగించుకోడానికి వీలుగా ఉంది.
అందువల్లనే అక్కడ అంతంత భారీ నిర్మాణాలు సాధ్యమయ్యాయి.
పరమ-సాపేక్ష అదనపు విలువలకున్న ఇంకో తేడా
పెట్టుబడి దారీ విధానం ఉందనీ, అన్ని ఇతరపరిస్థితుల్లో మార్పులేదనీ, పనిదినం పొడవు నిర్ణయమై ఉందనీ అనుకుందాం. అప్పుడు అదనపు విలువ పరిమాణం శ్రమ భౌతిక పరిస్థితుల్ని బట్టి, మరీ ముఖ్యంగా నేల సారాన్ని బట్టి మారుతుంది. అంతమాత్రాన పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం అభివృద్ధికి సారవంతమైన భూమి అత్యంత అర్హమైనదనే అర్ధం రాదు. ఈ ఉత్పత్తి విధానం ప్రకృతిమీద మనిషికున్న ఆధిపత్యం మీద ఆధారపడి ఉంటుంది. ప్రకృతి సమృద్ధిగా ఉంటే, బిడ్డని అటూ ఇటూ పోకుండా చేత్తో పట్టుకొని నడిపిస్తుంది. అతనంతటతను అభివృద్ధయ్యే అవసరాన్ని అతనిపై రుద్దదు.పెట్టుబడికి మాతృభూమి చెట్లూ, చేమలతో నిండివున్న ఉష్ణమండలం(tropics) కాదు, సమశీతోష్ణ
మండలం(temperate zone). ఇక్కడ ఒక సాధారణ సూత్రాన్ని చెబుతాడు:
పెట్టుబడిదారీ విధానం పుట్టింది సారవంతమైన ఉష్ణమండలాల్లోకాదు, సమశీతోష్ణమండలంలో.
సామాజిక శ్రమ విభజనకి భౌతిక ప్రాతిపదిక
సామాజిక శ్రమ విభజనకి భౌతిక ప్రాతిపదిక భూసారం ఒక్కటే కాదు.నేలలో తేడాలూ, ప్రకృతి ఉత్పాదితాల వైవిధ్యమూ, ఋతువుల మార్పులూ కూడా. ఇవి ప్రకృతి పరిసరాల మార్పుల ద్వారా మనిషిని తన అవసరాలనూ, శక్తులనూ, శ్రమ సాధనాలనూ, శ్రమ విధానాన్నీ బాగా పెంచుకునేదుకు ప్రోత్సహిస్తాయి. ఒక ప్రకృతి శక్తిని భారీ స్థాయిలో సమాజం తన పట్టులోకి తెచ్చుకోవలసిన ఆవశ్యకత, దాన్ని పొదుపుచెయ్యాల్సిన ఆవశ్యకత, మానవ శ్రమ ద్వారా దాన్ని స్వాధీనం చేసుకోవడానికో,లేక అణచివెయ్యాల్సిన ఆవశ్యకత పరిశ్రమ చరిత్రలో మొదట నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుంది. ఇందుకు ఉదాహరణ ఈజిప్ట్, లంబార్డీ, హాలండ్ లలో నీటి పారుదల నియంత్రణ.
అలాగే ఇండియా, పర్షియా లాంటి చోట్ల కృత్రిమ (మనిషి తవ్విన )కాల్వల ద్వారా నీటి పారుదల.ఆ కాల్వలు
నేలకు అవసరమైన నీరు అందించడమే కాక, కొండలపై నుండి ఖనిజాలతో నిండివున్న ఒండ్రుమట్టిని తెస్తుంది.
అరబ్బుల ఆధిపత్యంలో స్పెయిన్ లోనూ, సిసిలీలోనూ పరిశ్రమల వికాస రహస్యం నీటిపారుదల నిర్మాణాల్లోనే ఉంది.
ఇక్కడ ఫుట్ నోట్ లో ఇలా చెబుతాడు: ఇండియాలో విడివిడిగా వుండే చిన్నచిన్న ఉత్పత్తి సంస్థలమీద రాజ్యాధికారానికి ఒక ప్రాతిపదిక నీటి సరఫరా క్రమబద్ధీకరణ. ఈవాస్తవాన్ని మహమ్మదీయ పాలకులు, వాళ్ళ తర్వాత వచ్చిన బ్రిటీష్ పాలకులకంటే బాగా అర్ధం చేసుకున్నారు.ఇందుకు 1866 కరువుని గుర్తు తెచ్చుకుంటే చాలు. అప్పుడు బెంగాల్ ప్రెసిడెన్సీ ఒరిస్సా జిల్లాలో 10 లక్షలమంది మించి చనిపోయారు.
అనుకూలమైన ప్రకృతి పరిస్థితులు అదనపు శ్రమకి ఫలితమగా అదనపు విలువకీ, అదనపు ఉత్పాదితానికీ అవకాశాన్ని మాత్రమే ఇస్తాయి, కాని వాటిని వాస్తవం చెయ్యలేవు. ప్రకృతి పరిస్థితుల్లో తేడా వల్ల వచ్చే ఫలితం: ఒకే శ్రమ పరిమాణం వెర్వేరు దేశాల్లో తీర్చే అవసరాలు వెర్వేరుగా ఉంటాయి. మాస్సీ1750లోనేరాసినట్లుఏ రెండు దేశాల్లోనూ ఒకే శ్రమ పరిమాణం జీవితావసరాల్ని సమాన సంఖ్యలో చేకూర్చదు.మనుషుల కోరికలు వాళ్ళుండే వాతావరణన్ని బట్టి ఎక్కువో, తక్కువో ఉంటాయి. చలి ప్రదేశాల్లో వాళ్ళకి వేడి
ప్రాంతాల్లో ఉండేవాళ్ళకంటే
ఎక్కువ
బట్టలు కావాలి.అంటే ఎక్కువ శ్రమ అవసరం.అంతేకాదు, అక్కడ సేద్యానికి ఎక్కువ శ్రమ పడుతుంది. ఫలితంగా ఇతర అంశాలన్నీ ఒకేరకంగా ఉన్నప్పుడు, అవసర శ్రమ కాలం భిన్నంగా ఉంటుంది.
ఈ పరిస్థితులు సహజ హద్దులుగా మాత్రమే అదనపువిలువని ప్రభావితం చేస్తాయి. అంటే, ఇతరులకోసం చేసే
శ్రమ మొదలయ్యే బిందువుని నిర్ణయిస్తాయి. పరిశ్రమ పురోగమించే కొద్దీ, ఈ సహజహద్దులు వెనక్కి
నడుస్తాయి.
శ్రమ ఉత్పాదకత పెట్టుబడి ఉత్పాదకతగా కనిపిస్తుంది
లాభం అనేది శ్రమ నుంచి స్వతస్సిద్ధంగా వస్తుంది అనే అభిప్రాయాన్ని తోసిపుచ్చుతాడు మార్క్స్. అందుకు అవసర శ్రమ చాలా తక్కువ ఉన్న ఉదాహరణనిస్తాడు. ఎక్కువ అదనం ఇచ్చే బదులు ఇది ఎక్కువ కాళీ కాలాన్ని ఇస్తుంది.
పశ్చిమ ఐరోపా సమాజంలో శ్రామికుడు అదనపు శ్రమ చెల్లించి మాత్రమే, తన జీవనోపాధి కోసం పనిచేసే హక్కు
కొనుక్కుంటాడు.అటువంటి సమాజంలో అదనపు ఉత్పాదితాన్ని సమకూర్చడం మనిషి శ్రమకున్న స్వతస్సిద్ధ
లక్షణం అనే అభిప్రాయం వేళ్ళూనడం సులభమే. అందువల్లే, సమస్త శ్రమా అదనాన్ని వదలవలసిందే అన్నాడు
ప్రౌఢన్. అయితే ఆసియా ద్వీప సముదాయపు తూర్పు దీవుల్లో
నివసించే వ్యక్తిని ఉదాహరణగా చూడండి. అక్కడ అడవుల్లో సగ్గుబియ్యం చెట్లు తెగ
పెరుగుతాయి. చెట్టుకి బెజ్జం వేసి, దాని మూలుగు పండి ఉంటే, ఆబోదెని చాలా ముక్కలు చేస్తారు.మూలుగుని బయటకు లాగి నీళ్ళు
కలిపి వడగడతారు. అది ఇక సగ్గుబియ్యంగా ఉపయోగపడుతుంది. ఒక చెట్టునించి
మామూలుగా 300 పౌన్లు వస్తుంది.
ఎప్పుడయినా 500-600 పౌన్లు కూడా వస్తుంది.అక్కడి
ప్రజలు అడవుల్లోకి పోయి తమ ఆహారాన్ని చెట్లు కొట్టి తెచ్చుకుంటారు- పొయిలో
కట్టెలకోసం చెట్లు కొట్టి నట్లే.
ఈ పద్ధతిలో ఆహారం సంపాదించుకునే వానికి అన్ని అవసరాలూ తీరడానికి వారానికి 12 గంటలు పనిచెస్తే చాలు
అనుకుందాం. అతనికి ఎంతో తీరిక సమయం ఉంటుంది. అది అతనికి ప్రకృతిచ్చే ప్రత్యక్ష బహుమతి. అతను
ఆసమయాన్ని తనకోసం ఉత్పదకంగా వాడడానికి ముందు, కొన్ని చారిత్రక ఘటనల పరంపర అవసరమవుతుంది;
ఇతరులకు అదనపు శ్రమ గా ఖర్చుచెయ్యడానికి ముందు నిర్బంధం అవసరం. పెట్టుబడిదారీ ఉత్పత్తి వస్తే, ఒక రోజు ఉత్పాదితాన్ని సొంతం చేసుకోవడానికి ఒక నిజాయతీ పరుడు వారంలో 6 రోజులు పని చెయ్యాల్సి వుంటుంది. అతనెందుకు 6 రోజులు పని చెయ్యాలోలెదా 5 రోజులు ఇతరుల కోసం ఎందుకు పనిచెయ్యాలో ప్రకృతి దాతృత్వం వివరించదు.అతని అవసర శ్రమ కాలం వారానికి ఒక రోజుగా ఎందుకున్నదో మాత్రం వివరిస్తుంది.కాని ఏ సందర్భంలోనూ
అతని అదనపు ఉత్పాదితం మనిషి శ్రమలో నిగూఢంగా ఉన్న లక్షణం నుండి ఏర్పడదు.
ఆవిధంగా, చారిత్రకంగా అభివృద్ధి చెందిన సామాజిక శ్రమ ఉత్పాదకతతో పాటు, శ్రమ సహజ ఉత్పాదకతకూడా
ఆ శ్రమ ఏ పెట్టుబడితో కలిసిపోయిందో ఆ పెట్టుబడి యొక్క ఉత్పాదకతగా అగపడుతుంది.
వచ్చే పోస్ట్: శ్రమశక్తి ధర పరిమాణంలోనూ, అదనపువిలువ పరిమాణంలోనూ మార్పులు